సర్కారు తలుచుకుంటే ఎలాంటి అద్భుతమైనా జరుగుతుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో కోట్ల రూపాయలు పలికే భూమిని ఎకరా రూపాయికే కేటాయించారు.
ఎక్కడ...?
రంగా రెడ్డిజిల్లా ,గండిపేట మండలం కోకాపేట సెక్టార్ 5 లోని, సర్వేనెంబర్ 240 లో ఉన్న రెండు ఎకరాల భూమని కేవలం రెండు రూపాయలకే తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
ఎవరికి..?
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18న కేబినేట్ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏపీ లోని విశాక శారదా పీఠానికి భూమిని కేటాయించింది. సర్వేనెంబర్ 240లో 316.04 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉండగా, అదే సర్వే నెంబర్ నుండే భూమిని కేటాయించారు.
అసలు విలువ ఎంత?
రెవిన్యూ రికార్గుల ప్రకారం ఎకరం రూ.1.5కోట్లు ఉంది. మార్కెట్ రేట్ ప్రకారం రూ.15కోట్లకు పైగా ఉంటుందని ఆ ప్రాంతపు రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.
ఆ భూమిలో ఏం చేస్తారు?
రెండు ఎకరాల భూమిలో, శారదా పీఠానికి చెందిన వారు దేవాలయం, పాఠశాల, విద్యార్దులకు హాస్టల్,వేదమండపం ,కన్వెన్షన్ హాలు నిర్మిస్తారు.
ప్రయోజనం ఎవరికి?
రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందని, నైతిక విలువలతో కూడిన జీవన విధానం తెలంగాణ సమాజానికి శారదా పీఠం బోధిస్తుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.