హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగి రైలు సెవలు ప్రారంభమై దాదాపు సంవత్సరం దాటింది. ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు లక్ష మందికి పైగా రైలు ప్రయాణం చేశారు. కాలక్రమేన మెట్రో చార్జీలు అధికంగా ఉండటంతో ప్రజలు అంతగా వాటిపై మొగ్గు చూపలేదు. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు మాత్రమే మెట్రోను ఆశ్రయించేవారు. ప్రస్తుతం ఎండలు భాగా ఉన్న సమయంలో కూడా మెట్రోకు లక్ష మంది ప్రయాణికులు రాలేదు. ఇప్పటి వరకు రెండు లక్షల మంది ప్రయాణికులుగా రికార్డు కానీ వరుణుడి పుణ్యంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య మూడు లక్షకు చెరుకుంది.
నగరంలో వర్షం కురవడంతో మెట్రోకు కాసుల వర్షం కురిపించింది. శుక్రవారం భారీ వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ గంటల తరబడి ట్రాఫిక్జామయ్యాయి. దీంతో ప్రయాణికులు మెట్రోబాట పట్టారు. గతంలో ఒక్కరోజే 2.89 లక్షల మంది ప్రయాణించినట్టు రికార్డు ఉండగా శుక్రవారం ఆ రికార్డును అధిగమించి 3.06 లక్షల మంది ప్రయాణించారు. ముఖ్యంగా నగరంలోని హైటెక్సిటీ, దుర్గంచెరువు, మాదాపూర్ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో గంటల తరబడి వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిన విషయం తెలిసిందే.
వర్షం కారణంగా మెట్రో బాట పట్టడంతో కొన్నిగంటలపాటు ఓలా, ఊబెర్ సర్వీసులు నిలిచిపోయాయి. కొన్ని సాప్ట్వేర్ సంస్థలు కూడా రెగ్యులర్ బస్సు, కార్ సర్వీసులను రద్దు చేశాయి. ఐటీ ఉద్యోగులతోపాటు ఇతరులంతా మెట్రోలో ప్రయాణించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు ప్రత్యేక రైళ్లను నడిపారు. సమయం పొడిగించి రాత్రి 11–45 గంటల వరకు చివరి రైల్ను నడిపారు. దీంతో ఒకేరోజు రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య పెరిగింది.