ఉత్తర భారతదేశాన్ని దాదాపు క్లీన్ చేసే పనిలో చాలా వరకు సక్సెస్ అయిన బిజెపి కన్ను ఇప్పుడు సౌత్పై పడింది. ఇక్కడ చాలా కాలంగా పార్టీ ఉనికి చాటుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో బిజెపి వ్యూహాలు ఇక్కడ బెడిసి కొడుతున్నాయి. ఒక కర్ణాటకలో మాత్రం బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా... లోక్సభ ఎన్నికల్లో మాత్రం దాదాపు సక్సెస్ అయింది. బిజెపి చాలా రోజులుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కేరళపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
తమిళనాడులో ముందు నుంచి బిజెపికి ఆశలు లేవు. తెలంగాణలో మాత్రం కాస్త పట్టు చిక్కింది. దీన్ని నిలుపుకుని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. తాజా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ఏకంగా నాలుగు స్థానాలు గెలుచుకుని అందరి అంచనాలకు అందనంత ఎత్తులో నిలిచింది. మహా అయితే బిజెపి ఒక్క సికింద్రాబాద్ లో మాత్రమే గెలిచే ఛాన్స్ ఉందని అందరు అంచనా వేశారు. అయితే ఆ పార్టీ సికింద్రాబాద్ తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కూడా గెలుచుకుంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రోజురోజుకు పతనమై పోతుండడంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గద్దె దించి అక్కడ అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్కు చెందిన కొందరు పెద్దలకు వల వేసి వారిని తమ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని తన వైపునకు తిప్పుకునే క్రమంలో బిజెపి మెల్లమెల్లగా సక్సెస్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ లో ఉన్న అంతర్గత కలహాలను వాడుకునే క్రమంలో ఆ పార్టీ మాజీ మంత్రి, కీలక నేత హరీష్ రావుపై బిజెపి గేమ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.
బిజెపికి అనుకూలంగా ఉన్న జాతీయ మీడియాలో హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనక బిజెపి జాతీయ నాయకత్వం ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. బిజెపికి చెందిన కొందరు పెద్దలు అమిత్ షా సూచనల మేరకు హరీష్ రావుతో మంతనాలు చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గులాబీ బాస్ దృష్టికి రావడంతో ఆయన హరీష్ ను మరింత దూరం పెడుతున్నట్టు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న అపంతృప్తి నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్రావు రాలేదని అంటున్నారు.
హరీష్కు ఆహ్వానం ఉండి రాలేదా ? ఆహ్వానం ఉన్నా రాలేదా ? అన్నది మాత్రం సస్పెన్స్గా ఉంది. హరీష్ రావు బీజేపీలో చేరితే ఆ పార్టీ నుంచి అదిరిపోయే ఆఫర్ కూడా బిజెపి నుంచి వచ్చిందట. హరీష్ సైతం తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా పైకి స్పందించకపోయినా... లోలోన మాత్రం తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతున్న ట్లు తెలుస్తోంది. అవసరమైతే ఆయన బిజెపిలోకి వెళ్లి పోతారు అన్న ప్రచారం ముమ్మరం కావడంతోనే కేసీఆర్, కేటీఆర్ చాలా వరకు దూరం పెట్టినట్టు తెలుస్తోంది. ఏదేమైనా తెలంగాణ భవిష్యత్తు రాజకీయాలకు హరీష్రావు కేంద్రబిందువు కానున్నారన్నది వాస్తవం.