టీఆర్ఎస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. తనదైన శైలిలో నిర్మొహమాట కామెంట్లతో, అందులో పంచ్లతో ప్రసంగించడానికి మల్లారెడ్డి సుపరిచితుడు. కాలేజీ విద్యార్థులతో అయినా...పార్టీ కార్యకర్తలతో అయినా...ఆయన మాట్లాడే తీరు ఒకేలా ఉంటుంది. అందుకే మిగతా మంత్రులందరికంటే...ఆయనకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువ. అయితే, తాజాగా సోషల్ మీడియాలో మళ్లీ మంత్రి మల్లారెడ్డి పాపులర్ అయ్యారు. ఈ దఫా తన కామెంట్లతో కాకుండా...దాన గుణం, గొప్ప మనసుతో ఈ మంత్రి అందరి దృష్టిని ఆకర్షించారు.
వివరాల్లోకి వెళితే...మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి లోని గౌరీ ఆశ్రమంలో ఒక అనాథ యువతికి మంత్రి మల్లారెడ్డి వివాహం జరిపించారు. స్వయంగా మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అంతే కాదు యువతి పేరుతో 2 లక్షల 35 వేలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించారు. పెళ్లి ఖర్చుల కోసం 25 వేల రూపాయలు ఇచ్చారు. గుండ్లపోచంపల్లి లోని గౌరీ ఆశ్రమంలో ఉంటున్న పుష్ప అనే యువతికి ఏపీ విజయవాడకు చెందిన కిషోర్కు ఇచ్చి ఇలా పెళ్లి చేయించి మంత్రి మల్లారెడ్డి పలువురి అభినందనలు పొందారు. అమ్మాయి తరపున మల్లారెడ్డి, ఆయన భార్య కల్పన అన్నీ తామై వ్యవహరించి ఈ వివాహం జరిపించడం పట్ల గౌరీ ఆశ్రమ నిర్వాహకులు, వివాహానికి వచ్చిన పెద్దలు, స్థానికులు మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి మల్లారెడ్డి యొక్క గొప్ప మనసుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందరో పారిశ్రామికవేత్తలు, ఇతర మంత్రుల కంటే భిన్నంగా మల్లారెడ్డి వ్యవహరించారని పలువురు ప్రశంసిస్తున్నారు. తన మాటలతో అందరినీ ఆకట్టుకునే మంత్రి మల్లారెడ్డి చేతలతో కూడా అదే రాతిలో వ్యవహరించారని పలువురు పేర్కొంటున్నారు.