రాజకీయ నేతలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయించి అదేమిటంటే అని అడిగితే ప్రజా సేవా కోసమని నిస్సిగ్గుగా మాట్లాడతారు. అయితే టీడీపీ పార్టీ నుంచి ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి జంప్ అయిన సంగతీ తెలిసిందే. అయితే చంద్రబాబే వీళ్ళను ఆ పార్టీలోకి పంపించాడని మరో వాదన. అయితే తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాల గురించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల కంటే బాగా ఇంకెవరికి తెలుసు.? చంద్రబాబుకి బినామీలుగా ఈ ఇద్దరిపైనా ఎప్పటినుంచో ఆరోపణలున్నాయి.


ఇప్పుడు ఈ ఇద్దరూ బీజేపీలోకి వెళ్ళారంటే, చాలామంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేయకుండా వుంటారా.? చంద్రబాబే ఆ ఇద్దర్నీ, వాళ్ళతోపాటు మరో ఇద్దర్నీ బీజేపీలోకి పంపారన్న అనుమానాలు చాలా వైపులా నుంచి వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి మాత్రం, అబ్బే.. అదేం లేదని బుకాయిస్తున్నారు. 'మీరు బీజేపీలోకి వెళ్ళారు కదా.. చంద్రబాబు ఆర్థిక మూలాలకు దెబ్బ తగిలినట్లేనా.? మీ ద్వారా ఆ ఆర్థిక సంబంధమైన విషయాల్ని వెలికి తీసి, చంద్రబాబుని బీజేపీ ఇరకాటంలో పెట్టబోతోందా.?' అని ప్రశ్నిస్తే, 'మీ ప్రశ్నేంటో నాకు అర్థం కావడంలేదు.


అసలు ఆ ప్రశ్నలోనే అర్థం లేదన్నది నా ఉద్దేశ్యం' అంటూ సుజనా చౌదరి, తనకు అస్సలేమాత్రం తెలియదన్నట్టు వ్యవహరించేశారు ఓ ఇంటర్వ్యూలో. మామూలుగా అయితే, 'నో కామెంట్‌' అనాల్సిన ప్రశ్నకి, సుజనా చౌదరి ఉలిక్కిపడ్డారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తెచ్చి తీరతామంటున్నారు.  'నాకు డబ్బులతో పనేంటి.? నాకు పదవులతో పనేంటి.? ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను..' అని సుజనా చౌదరి నీతులు చెబుతోంటే, వినేవాళ్ళకి చెవులు బరువెక్కిపోతున్నాయ్‌. అంతలా జనం చెవుల్లో సుజనా చౌదరి క్యాలీఫ్లవర్లు పెట్టేస్తున్నారు మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: