విజయవాడలోని ప్రజావేదికలో రెండవరోజు మంగళవారం నాడు కలెక్టర్లతో సమావేశం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఏపీ సీఎం ఎస్పీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కాల్మనీ సెక్స్ రాకెట్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ చోటు చేసుకోవడం దారుణమన్నారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తిని అరికట్టేందుకు ఆగష్టు మాసంలో భారీ ఆపరేషన్ చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. గంజాయిని సాగు చేస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను చూపాలని జగన్ ఉన్నతాధికారులకు సూచించారు.
‘‘ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘‘ స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించాలి. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని 6 మండలాల్లో, తూర్పు గోదావరి జిల్లాలోని రెండు మండలాల్లో గంజాయి సాగవుతోంది. గంజాయి సాగును రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా అరికట్టే ప్రయత్నం చేయాలి. దీనిపై పోలీసు నిఘావిభాగం, గ్రేహౌండ్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. గంజాయి సాగును నిరోధించేందుకు కొత్త తరహా ప్రణాళికలు తయారుచేయండి. కాఫీ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలి’’ అని సీఎం సూచించారు.
గంజాయి సాగు చేసే గిరిజనును కాఫీ ప్లాంటేషన్ను పెంచేలా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తంగా ఉండాలని జగన్ కోరారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి రాష్ట్రంలో బెల్ట్షాపులను ఎత్తివేయాలని ఆయన ఆదేశించారు.జాతీయ రహదారుల వెంట లిక్కర్ అమ్మకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. జాతీయ రహదారుల వెంట మద్యం షాపులను ఎత్తివేయాలని ఆయన కోరారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న చర్యల్ని వివరించారు. ఎన్నికల తర్వాత గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత ఉందని, 12,198 మంది సిబ్బంది అవసరమని చెప్పారు. విభజన హామీల మేరకు కొత్తగా ఆరు ప్రత్యేక పోలీసు బెటాలియన్లు, రెండు ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు రావాల్సి ఉందని తెలిపారు. పోలీసులకు వారాంతపు సెలవులు అమలు చేయడంపై ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పటిష్ఠం చేస్తామని, రౌడీయిజం, ఫ్యాక్షనిజంపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తామని, గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖలో అధికంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. శాంతిభద్రతల పరిక్షణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.