తన ఆలోచనలతో, తన వ్యూహాలతో అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోనే ప్రజల మనసులపై చెరగని ముద్ర వేసిన వైసీపీ అధినేత, సీఎం జగన్ .. మరింతగా వ్యూహాత్మకంగా వెళ్తే మంచిదని సూచిస్తున్నారు మేధావులు. ఇప్పటి వరకు జగన్ వేసిన ప్రతి అడుగు విమర్శలకు అతీతంగానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రధానంగా ఆయన ఏ విషయం చేపట్టినా.. ప్రజలకు, ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎక్కడా విస్మరించడం లేదు. అదే సమయంలో తాను చేయాలని అనుకు న్న దానిని ఎక్కడా విడిచి పెట్టడం లేదు.
ఈ తరహా వ్యూహం నిజానికి గత ప్రభుత్వంలో ఎక్కడా మనకు కనిపించలేదు. గత ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేసేసింది. దాంతో ప్రజలకు ఏం సంబంధం లేకుండా చేసింది. ప్రజలు వద్దన్నా.. కాదన్నా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్లింది. దీంతో ప్రజలకు-ప్రభుత్వానికి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది. బహుశ ప్రతిపక్ష నేతహోదాలో ఉన్న జగన్ ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారో.. ఏమో.. ఇప్పుడు ప్రతి విషయంలోనూ తాను చేయాలని అనుకున్నది చేస్తూనే.. పరోక్షంగా ప్రజలకు తెలిసేలా, వారి నుంచి మద్దతు కూడగట్టుకునేలా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే, దీనికి ముందు మరింతగా ఆయన ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలనేది మేధావుల మాట. ఇప్పుడు గత ప్రభుత్వం కట్టించిన ప్రజావేదికను కూల్చేస్తానని ప్రకటించిన జగన్ విషయంపై చర్చ నడుస్తోంది. అదే సమయంలో తాను హోదాను పట్టుకునే ఉంటానని ప్రకటించడం, కేంద్రం మాత్రం ఇవ్వనని తాజాగా మరోసారి ప్రకటించడం కూడా చర్చకు వస్తున్న విషయం. ఈ రెండు విషయాల్లోనూ ప్రజలను మరింత భాగస్వాములను చేయాలని అంటున్నారు మేదావులు.
ఈ క్రమంలోనే బేషజాలకు పోకుండా ఆయనఅఖిల పక్షం సమావేశం నిర్వహించి అన్ని పార్టీలతో చర్చించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెబుతున్నారు. అదే సమయంలో కేంద్రంపైనా అఖిల పక్షాన్ని ప్రయోగించడం ద్వారా సక్సెస్ అయితే.. జగన్కే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల ప్రజల్లోకి జగన్ మంచి సంకేతాలను పంపించినట్టు అవుతుందని అంటున్నారు. ఈ నయా ప్లాన్ సక్సెస్ అయితే జగన్కు ప్రజల నుంచి మరింత స్పందన రావడం ఖాయం.