ఎమర్జెన్సీ కాలాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో చీకటి రోజులుగా అభివర్ణిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఆధారంగా చేసుకొని నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. రాష్ట్రపతి సాయంతో 1975 జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీని విధించారు. 1977 మార్చి 21 వరకు 19 నెలలపాటు అత్యవసర పరిస్థితి కొనసాగింది.

 

ఎమర్జెన్సీ సమయంలో ఇందిర తన ప్రత్యర్థులను చాలామందిని జైలుకు పంపారు. పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లింది. ఎమర్జెన్సీ విధించి జూన్ 25, 2019 నాటికి 44 ఏళ్లు. ఈ అత్యవసర పరిస్థితిపై రాజకీయ నాయకులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కూడా ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.

 

‘ఇదే రోజు 34 ఏళ్ల క్రితం నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని విధించారు. భారత ప్రజాస్వామ్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి హాని తలపెట్టే.. ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా మనం తీర్మానించుకుందాం’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

 

ఢిల్లీ సీఎం ట్వీట్‌లో చిన్న తప్పిదం దొర్లింది. 1975లో ఎమర్జెన్సీ విధిస్తే.. ఇప్పటికీ 44 ఏళ్లు అవుతుంది. కానీ ఆయన 34 ఏళ్ల క్రితం అత్యవసర పరిస్థితి విధించారని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని చూసుకో బాబూ.. అని నెటిజన్లు సూచిస్తున్నారు. అంతే కాదు.. 44 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన పార్టీతో 44 రోజుల క్రితం పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించావంటూ.. లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో ఆప్ దోస్తీకి యత్నించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: