ప్రముఖ నగరాల్లో అక్కడక్కడ వేడివేడి కచోరీలు అమ్మే దుకాణాలు కనిపిస్తాయి. అయితే, ఉత్తర ప్రదేశ్ స్టేట్ అలీగఢ్ నగరం దీనికి భిన్నం. సీజన్ ఏదైనా సరే, ఇక్కడ కచోరీ గిరాకీకి తిరుగలేదు. ఈ షాపులను చూస్తూ వెళ్లడం- వీలైతే ఆగి తినడం- అంతేకానీ వీటి ఆదాయం ఎంతని తెలుసుకునే ఇంట్రస్ట్ ఎవరికీ రాదు. ఒకవేళ వచ్చినా, మహా అయితే రోజుకి వెయ్యో రెండువేలో వుంటుంది అనుకుంటారంతా. కానీ, సరిగ్గా ఇక్కడే తప్పులో కాలేస్తారు. సీమా టాకీస్ పక్కన ఉండే ఓ కచోరీ దుకాణం ఆదాయం ఎంతో తెలుసా? నెలకు అక్షరాలా 6 లక్షలు. అంటే ఏడాదికి ఇంచుమించు 70 లక్షలు. నిజంగానే షాక్ తిన్నారు కదా? మీ కంటే షాక్ తినడం ఐటీ అధికారుల వంతు అయింది.
కచోరీ దుకాణం ఏటా టర్నోవర్ 70 లక్షలన్న సంగతి తెలుసుకున్న వాణిజ్య పన్నుల శాఖ ముందు కంగారు పడింది! తర్వాత, తేరుకుంది. అది వాస్తవమో కాదో తెలుసుకునేందుకు ప్లానేసింది. ఆఫీసర్లంతా కలిసి షాప్ దగ్గర కొన్నాళ్లు రెక్కీ నిర్వహించారు. వచ్చీపోయే జనాన్ని, గిరాకీని అంచనా వేశారు. మెల్లిగా కూపీ లాగి, ఆదాయంపై ఓ కంక్లూజన్కు వచ్చారు. ఇంకేముంది చలో రైడింగ్ అంటూ ముకేశ్ ఇంట్లో సోదాలు చేశారు. నిజంగానే ఆయన కోటీశ్వరుడని తేలింది. ఇంత ఆదాయం ఉన్నా ఇప్పటివరకు ముఖేష్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించలేదు. అసలు ఆ సంగతే ఆయనకు తెలియదు. అయితే నిబంధనల ప్రకారం ఏడాదికి రూ.40లక్షల ఆదాయం దాటితే జీఎస్టీ పరిధిలోకి వస్తారు. కానీ ముఖేష్ పైసా కట్టేలేదు. చట్టపరంగటా పన్ను ఎగవేసినందుకు గాను అరెస్టు వారెంట్ జారీ చేశారు.
విచిత్రం ఏంటంటే, అలీగఢ్లో కచోరీలు అమ్మి ముకేశ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లు ఇంకా బోలెడు మంది ఉన్నారట. వారిపై రైడ్ చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. కచోరీ షాప్ వాడి ఆదాయం నెలకు ఎంత లేదన్నా 6లక్షలు ఏడాదికి 70 లక్షలు అంటేనే నమ్మబుద్ధి కావడం లేదంటే ఇలాంటి వారి ఇంకెందరో ఉన్నారో అనే సంగతి నిజంగా ఆశ్చర్యమే.