‘స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి. జనసేనలో డైనమిక్‌ లీడర్లున్నారు. ఒక్క ఎన్నికల్లో ఓడినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నాపై నమ్మకం ఉంచండి. మీ వెనక నేనుంటాను’ అని ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు.

 

పార్టీ కీలక నేతలతో రెండురోజులపాటు వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలమైన పార్టీగా నిలవాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు 3-4నెలల సమయం ఉందని.. ఈలోగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపిచ్చారు.

 

ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. పాత విషయాల్ని పక్కన పెట్టి, భయాన్ని విడిచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు బాసటగా నిలిచేందుకు కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.

 

జనసేన ఒక్క కులానికి మాత్రమే పరిమితం కాదన్నారు. కులాల్ని కలిపే ఆలోచన మన పార్టీ సిద్ధాంతాల్లో ప్రధాన అంశంగా ఉందని గుర్తుచేశారు. జనసేనలో కాపులను గౌరవిస్తామన్న ఆయన.. ఆ ముద్ర వేసుకోమని స్పష్టం చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలూ అదే విధంగా ఉండాలని సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రతినిధులను, ప్రజలను పవన్‌ కలిశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: