సహజంగానే రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ అంటే.. సానుభూతి ఉంటుంది! కానీ, ఎందుకో కానీ.. చంద్రబాబు విషయంలో ఎక్కడా సానుబూతి కనిపించడం లేదు. గడిచిన వారం రోజుల్లో చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీకి అనేక అవమానాలు ఎదురయ్యాయి. నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారిపోయారు. వీరంతా కూడా చంద్రబాబుకు చాలాఅత్యంత ఆప్తులు. బాబు అంటే ప్రాణం ఇచ్చేవారు. అయినా కూడా పార్టీకి రాం రాం చెప్పి బీజేపీ కండువా కప్పుకొన్నారు.
మరి ఈ నేపథ్యంలో ప్రజల నుంచిసానుభూతి భారీ ఎత్తున కురవాలి. కానీ, మనకు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఇద్దరు మాట్లాడినా.,. సీఎంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపైనే చర్చించుకుంటున్నారు. తప్పితే.. మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పార్టీ గురించి పెద్దగా ఎవరూ చర్చించుకోవడం లేదు. ఇక, తాజాగా బాబు ఇష్టపడి కట్టించుకున్న కలల సౌధం ప్రజావేదికను రేపు కూల్చివేయాలని ఆదేశాలు వచ్చాయి. సీఎం హోదాలో జగన్ నేరుగా సీఎస్కు ఇచ్చిన తొలి ఆదేశం ఇదే నని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ భవనం రూపు రేఖలు 24 గంటల్లోనే మారిపోనున్నాయి. మరిదీనిపై కూడా ప్రజల నుంచి సానుభూతి కరువైంది. ఇక, ఇప్పుడు నేరుగా చంద్రబాబు, ఆయన కుటుంబానికి కూడా ప్రభుత్వం భద్రతలను చాలా వరకు తగ్గించేసింది. కుటుంబానికి పూర్తిగా ఎత్తేసి, బాబు, ఆయన కుమారుడు లోకేష్లకు మాత్రమే భద్రతను ఇచ్చింది. వాస్తవానికి ఈ విషయం కూడా సంచలనం సృష్టించేదే. అయితే, దీనిపైనా ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఏ ఇద్దరు కలిసినా.. జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడని, ఆయనను అభినందిస్తున్నారే తప్ప.. చంద్రబాబు అవమానాలపై ఏ ఒక్కరూ పెదవి కూడావిప్పడం లేదు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసుకున్న పాపం ఏంటి? జగన్ చేసుకున్న పుణ్యమేంటి? అనే చర్చ తెరమీదికి వస్తోంది. అధికారంలో ఉండగా అంతా నాకే తెలుసు.. నన్ను మించిన నాయకుడు దేశంలోనే లేడని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇదే ప్రజలకు ఆయనకు మధ్య అనుబంధాన్ని దూరం చేసింది. చివరికి.. బాబు ఇచ్చిన డబ్బులు తీసుకున్న వారు(పసుపు కుంకుమ) కూడా ఆయనను పట్టించుకోలేదు. పార్టీలో నేతలను దూరం చేసుకున్నారు. కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా మొత్తానికి ఓ స్వయంకృతం నేడు అవమాన భారంతో కుంగిపోతోందని చెప్పకతప్పదు!