ప్రజావేదికను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు టీడీపీలో చిచ్చు రేపుతోంది. అసలే అది అక్రమ కట్టడం.. అయినా ఆ విషయంలో తమ తీరును సమర్థించుకోవడానికి అపసోపాలు పడుతూ ఉన్నారు తెలుగుదేశం నేతలు. చంద్రబాబు నాయుడి బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలిచింది 'ప్రజావేదిక'. ఆ భవన నిర్మాణమే అక్రమం అని స్పష్టం అవుతోంది. అలాంటి అక్రమ కట్టడం చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలోని ప్రభుత్వం చేపట్టిందని స్పష్టం అయ్యింది.


ఆ భవనంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న తమ వారి అక్రమ కట్టడాలను కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించినట్టుగా ఉన్నారు. ప్రజావేదికను తమకు అప్పగిస్తే ఆ చుట్టుపక్కల అక్రమ కట్టడాలు అన్నీ సేఫ్ అవుతాయని చంద్రబాబు లెక్కేశారట. అయితే అక్రమకట్టడాల్లో దేన్నీ వదిలేదని జగన్ మోహన్ రెడ్డి ఆ భవంతిని కూల్చేయించారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది. కానీ తెలుగుదేశం నేతలంతా కాదు. ప్రజావేదిక కూల్చడాన్ని కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. 


ఈ జాబితాలో చేరారు తోట త్రిమూర్తులు. ప్రజావేదిక కూల్చివేత సబబే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఆ అక్రమ కట్టడం మాత్రమే కాకుండా.. కృష్ణాతీరంలో అన్ని అక్రమ కట్టడాలనూ కూల్చేయాలని ఆయన సలహా ఇచ్చాడు. అంతేకాదు.. ఈ విషయంలో తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న తీరును త్రిమూర్తులు తప్పుపట్టారు. అన్ని విషయాల్లోనూ అధినేత భజన మానుకోవాలని ఘాటు సలహా ఇచ్చారట త్రిమూర్తులు. ఇప్పటికే ఈ అంశం మీద కేశినేని స్పందించిన తీరు తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లోకి నెట్టింది. ఇప్పుడు త్రిమూర్తులు స్పందించిన తీరుతో తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడుతూ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: