ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్ని తానే అన్నట్టు చక్రం తిప్పారు. రాజధాని వ్యవహారాలు, సీఆర్డీఏ ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు విదేశీ పర్యటన చేసిన ప్రతిసారి నారాయణ కూడా వెంట ఉండేవారు. ఇక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లా రాజకీయాలన్నీ నారాయణ కనుసన్నల్లోనే జరిగాయి. కొన్ని చోట్ల టిక్కెట్లు ఎంపికలోనూ నారాయణ చక్రం తిప్పారు. రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో.... కమ్మ వర్గం కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతూ వస్తుంది.
అయితే ఈ రెండు సామాజిక వర్గాలను పక్కన పెట్టేసి నారాయణ వన్ మ్యాన్ షో చేసేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి... ఆయన ఓడిపోయాక ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఇప్పుడు నారాయణ ఎక్కడున్నారు ? ఏం చేస్తున్నారు ? అన్నదే నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చివరకు చంద్రబాబుకు సైతం ఆయన దొరకడం లేదట.
ఇదిలా ఉంటే నారాయణ వియ్యంకుడు గంటా తన గ్యాంగ్తో బీజేపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నారాయణ తన ఆస్తులు, వ్యాపారాల కోసం ముందుగా బీజేపీలోకి వెళ్లాలనుకున్నారట. ఆ తర్వాత ఆయన చూపులు వైసీపీ వైపు కూడా పడ్డాయ్. అయితే నారాయణపై గెలిచిన మంత్రి అనిల్ నారాయణనే కాదు.. నెల్లూరులో టీడీపీ నాయకుడిని అనే వాళ్లనే తన గడప తొక్కనీయడం లేదట. ఇక నారాయణను మాత్రం వైసీపీలోకి రానిస్తాడన్నది అనుమానమే. అందుకే నారాయణ ఇప్పుడు మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
నారాయణ మనస్సు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో తన విద్యాసంస్థల విషయంలో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో వైసీపీ వాళ్లతో రాజీతో ఉండాలని చూస్తున్నారట. అయితే జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో నారాయణ విద్యాసంస్థలపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు నారాయణతో ఏ మాత్రం లాలూచీ పడ్డా వైసీపీపై విమర్శలు వస్తాయి. అందుకే జగన్ కూడా నారాయణను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. అటు టీడీపీకి భవిష్యత్తు లేదు. అందుకే టీడీపీ వాళ్లకు దూరంగా బీజేపీలోకి వెళ్లే ప్రయత్నాలు మనోడు సీక్రెట్గా చేసుకుంటున్నట్టు భోగట్టా.