కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారని అన్నారు.

 

పార్లమెంట్ ఎన్నికల్లో 20శాతం ఓట్లు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ వేగంగా పుంజుకుంటోందన్నారు. బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కశ్మీర్ రాష్ట్రాల్లలో అధికారమే లక్ష్యంగా పనిచేయబోతున్నామని చౌహాన్ స్పష్టం చేశారు.

 

తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. తాను 15 ఏళ్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఏ ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిని చూడలేదని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లుంటే తెలంగాణ సమస్యలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేదన్నారు.

 

రాష్ట్రంలో బీజేపీని వేగంగా బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు శివరాజ్ సింగ్ తెలిపారు. జులై 6న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. దేశంలోని అన్ని వర్గాలను సభ్యత్వంలో భాగస్వాములను చేస్తామన్నారు. కళాకారులు, క్రీడాకారులను సైతం బీజేపీ కుటుంబంలో భాగస్వాములను చేస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: