ఏపీలో విపక్ష టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీడీపీ దిగ్గజ నేతలందరూ పార్టీని వీడడం కలవరపెడుతోంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బీజేపీలోకి జంప్ చేసేశారు. ఇక ఇప్పుడు బీజేపీ టార్గెట్ టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల మీద పడింది. ఈ క్రమంలోనే వీరు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా బుధవారం ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యక్షమైనట్టు రాజకీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుపై వరుసగా రెండోసారి గెలిచిన ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అనగాని ఢిల్లీ వెళ్లీ అక్కడ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లినట్టుగా చెపుతున్నారు. ఇక అనగానితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ వెళ్లినట్టు వార్తలు వస్తున్నా... వారి పేర్లు మాత్రం బయటకు రావడం లేదు.
ఇక పార్టీ మారతారని వార్తలు వస్తోన్న వారిలో కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పేర్లు కూడా లైన్లో ఉన్నాయి. వీరిపై సుజనాచౌదరి ఒత్తిడి చేసి పార్టీ మారేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరాంధ్రలోని ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి. వీళ్లలో జంపింగ్లకు కేరాఫ్ అయిన ఓ మాజీ మంత్రి ఆధ్వర్యంలో వీరు ఎప్పుడు ఎలాంటి డెసిషన్కు అయినా రెడీ అంటున్నారట.