ఏపీలో టీడీపీ పరిస్థితి ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరు ఊహించెదరు అన్నట్టుగా ఉంది. కొద్ది రోజులుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారానికి ఊతమిస్తూ ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యక్షమైనట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఒకరని తెలుస్తోంది. అనగానితో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లిపోయారని.. వీరు పార్టీ కండువా కప్పుకోవడమే మిగిలి ఉందని తెలుస్తోంది.
అనగాని టీడీపీలో పడే ఫస్ట్ వికెట్ అయితే రెండో వికెట్ టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు అయిన కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ. వల్లభనేని వంశీ మోహన్ పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనను ఇటీవలే టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వంశీ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
తాజాగా యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో జరిపిన సమావేశానికి వంశీ డుమ్మా కొట్టేశారు. కనీసం వంశీ ఫోన్కు కూడా అందుబాటులో లేడని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాకు చంద్రబాబు, లోకేష్ ప్రయార్టీ ఇవ్వడాన్ని సహించలేని వ్యక్తుల్లో వంశీ కూడా ఒకరు.
ఇక వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నానితో వంశీకి మంచి సంబంధాలున్నాయి. పార్టీ మారిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వంశీతో ఎక్కువ టచ్లో ఉంటున్నారట. ఇక్కడ ఉండి ఐదేళ్ల పాటు చేసేదేం ఉండదు... పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం నీకు ఉందా... ? బీజేపీలోకి వస్తే ఐదేళ్ల తర్వాత ఏపీలో వైసీపీకి పోటీగా ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది. ఏదేమైనా టీడీపీ రాజ్యసభ ఎంపీలను చేర్చుకొని జోరుగా ముందుకెళుతున్న బీజేపీ ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై కూడా వల విసరుతోంది.