టీడీపీ పార్టీ నుంచి బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలోకి జంప్ అయిన సంగతీ తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని సంకేతాలు పంపుతోంది. తాజాగా టీడీపీ గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కమలదళంతో టచ్‌లోకి వెళ్లారట.


ఆయనతో పాటూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న అధికార ప్రతినిధి లంకా దినకర్‌లు.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఢిల్లీలో ఇటీవలే టీడీపీని వీడిన ఎంపీ గరికపాటితో కలిసి బీజేపీ పెద్దల్ని కలిసినట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాదు.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఏకంగా 16మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈలోపే అంబికా కృష్ణా, బాలయ్య బంధువు పొట్లూరి బాబు వంటి చోటా మోటా నేతలు కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. అనగాని సత్యప్రసాద్ రేపల్లె ఎమ్మెల్యే. 2014లో సత్యప్రసాద్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు.. రేపల్లె టికెట్ కేటాయించారు. ఆయన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను ఓడించారు. 2019లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి.. మళ్లీ మోపిదేవిపై గెలిచారు. పార్టీకి విధేయుడిగా ఉండే అనగాని బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్లడం టీడీపీల చర్చనీయాంశంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: