ప్రజా తీర్పును గౌరవించడం అంటే.. ఒకింత అవమానంగా భావిస్తున్నారా?- ఇప్పుడు ఈ ప్రశ్న.. మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పలువురు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఏర్పా టైంది. వాస్తవానికి తిరిగి తన ప్రభుత్వమే వస్తుందని బావించిన చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన తీర్పు గొడ్డలి పెట్టుగా మారడంతో ప్రతిపక్షంలో కూర్చున్నారు. దీంతో అటు పార్టీ నుంచి కూడా వలసలు ప్రారంభమయ్యాయి. మరోపక్క, అధి కారంలోకి వచ్చిన జగన్ తన తడాఖా చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్న టీడీపీ హవా నానాటికీ సన్నగిల్లుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు విరుగుడు మంత్రం పాటించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు జగన్ ప్రబుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్దేశపూర్వకంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అమరావతి నిర్మాణం పెద్ద ప్రాజెక్టు. భూములు ఇచ్చిన రైతులు, ప్రజలు, ప్రభుత్వం ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా రూపుదిద్దాం. స్విస్ చాలెంజ్ విధానంలో పోటీ బిడ్డింగ్ కింద పనులు చేపట్టాం’’ అని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, ఇక్కడకు వచ్చిన సంస్ధల వల్ల రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయని... కొత్త ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లోనే వాటి ధరలు పడిపోయాయని చెప్పడం ద్వారా.. జగన్ ను ఓ విఫలమైన నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంతో పోటీపడి పెట్టుబడులు రాబట్టాల్సిందిపోయి, ఉన్న వాటిని కూడా తరిమేసేలా జగన్మోహన రెడ్డి వ్యవహరిస్తున్నారని బాబు ఆరోపించారు.
అయితే, ఇదే సమయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా బాబు ఒక్కసారి వినిపించుకోవాలి. పెట్టుబడులు రావడం కోసం అక్రమాలు, అన్యాయాలకు తెరదీస్తారా? లేని రేటుకు లీజులు ఇస్తారా? కాంట్రాక్టర్లకు దోచి పెడతారా? అనేది ఇప్పుడు చంద్రబాబుకు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. మొత్తానికి ఎక్కడికక్కడ దోచేసుకున్న నాయకులు కళ్ల ముందు కనిపించిన కారణంగానే చంద్రబాబు ప్రభుత్వంపై కేవలం ఐదు సంవత్సరాల్లోనే ప్రజల మనసుమారి.. మార్పు కోరుకుందన్న విషయాన్ని బాబు గుర్తిస్తే.. మంచిదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా ప్రజాతీర్పును ఆయన గౌరవిస్తారో లేదో చూడాలి.