అక్రమ నిర్మాణాలు అంటే నిర్మాణ అనుమతులు మరియు నిబంధనలకు విరుద్ధంగా రెండంతస్తుల ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయాన్ని నిర్మించిన ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి కి కాకినాడ - గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - జియుడిఏ — అధికారులు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో స్పష్టం చేశారు.
సంజాయిషీ కోరుతూ అందించిన నోటీసు అందుకున్న ఏడురోజుల్లోగా స్పందించాలని అంటూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె అనూషకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. వివరాల్లోకి వెళితే, తెలుగుదేశం ప్రభుత్వపాలనాకాలంలో పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 208/5-ఎ లో ప్రింటింగ్ ప్రెస్ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభం కూడా చేసింది. ప్రస్తుతం ఇక్కడి నుంచే పత్రికా వ్యవహారాలు నడుస్తున్నాయి.
అయితే, దీని నిర్మాణం కోసం "డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ - డీటీసీపీ" అధికారుల నుంచి గానీ "గుడా" నుండి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్రభుత్వం నిర్దేశించి న ఫీజును చెల్లించలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించలేదు. భవన ప్రధాన ముఖద్వారం - ప్రధాన మార్గం ముఖంగా కాకుండా మరో ప్రక్క రహదారి (పెరిఫెరల్ రోడ్) ముఖంగా నిర్మించాల్సి ఉండగా, అలా నిర్మాణం జరగలేదు.
అక్రమ నిర్మాణాలపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండడంతో ఆంధ్రజ్యోతి యాజమాన్యం అప్రమత్తమైంది. తమ భవనానికి యుద్ధ ప్రాతిపదికన అనుమతులు ఇవ్వాలని ‘గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ - గుడా’ అధికారులపై విపరీతమైన ఒత్తిడి తెస్తోంది. భవన క్రమబద్ధీకరణ పథకం - బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసు కోవాలని గుడా వర్గాలు పలుమార్లు చెప్పినా పట్టించు కోవడం లేదు. బీఆర్ఎస్ కింద అయితే సుమారు ₹70 లక్షలు చెల్లించాల్సి వస్తోందని దానికి ససేమిరా! అంటోంది ఆంధ్రజ్యోతి యాజమాన్యం.
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు ఈ పరిస్థితుల్లో అధికారులు ఈ నెల 25న ప్రొవిజినల్ ఆర్డర్ నోటీసు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాన్ని తొలగించాలని, లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.