ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో సీఎం జగన్ మౌనం రాష్ట్రానికి శాపమని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. నిన్నటి సీఎంల సమావేశంలో జగన్ గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
గత నాలుగేళ్లల్లో 263 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించామని ఉమా తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
"బహుదా-వంశధార-నాగావళి లింక్ పనులను ఎందుకు ఆపారు..? ఉత్తరాంధ్రపై జగనుకెందుకంత కోపం... ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను ఎందుకు నిలుపుదల చేశారు. ఇరిగేషన్ విషయంలో జగన్ మౌనం మంచిది కాదు."
"రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదు. గోదావరి-పెన్నా అనుసంధానం పనులను ఎందుకు ఆపారు..? కృష్ణా నది వరదను ఒడిసిపట్టే వైకుంఠాపురం బ్యారేజ్ పనులు ఎందుకు ఆపారు. రాయలసీమ రైతులు ఏం అన్యాయం చేశారని గోదావరి-పెన్నా అనుసంధాన పనులు ఆపారు."
"రివర్స్ టెండరింగ్ వంటి సుభాషితాలు ఏపీ బోర్డర్ దాటితే ఎందుకు రావడం లేదు..?ఏపీలో కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్న జగన్.. బోర్డర్ దాటాక రివర్స్ టెండరింగ్, జుడిషియల్ కమిషన్ వంటి మాటలు ఎందుకు రావడం లేదు. 512 టీఎంసీల నికర జలాలపై ఏపీకి ఉన్న హక్కులను కాపాడుకోవాలి."