ఇప్పటి వరకు ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ నుంచి వలసలు చూశాము. కానీ అధికార పార్టీ నుంచి అసంతృప్తితో ఉన్న కీలక నేత రాజీనామా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఆయనే మాజీ మంత్రి, సీనియర్ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు. తన భార్య, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కోరిక మేరకు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును.. ప్రస్తుతం ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తోంది.
అంతేకాదు, ఆయనతో పాటు కుమారుడు హితేష్ చెంచురామ్ కూడా బీజేపీ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా పర్చూరులో మాత్రం ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది.
దీనికితోడు జగన్ వేవ్ భారీగా ఉంది. అయినా.. సీనియర్ నేత ఓడిపోవడంతో ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, భార్య ఒక పార్టీలో ఉండడం.. భర్త మరో పార్టీలో ఉండడాన్ని కూడా చాలా మంది సామాన్య ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఇది కూడా దగ్గుపాటి ఓటమి ప్రధాన కారణాల్లో ఒకటి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వేరు వేరు పార్టీల్లో ఉండి చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడమే మేలని దగ్గుబాటి భావిస్తున్నట్లు సమాచారం.