ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనాకాలంలో చోటు చేసుకున్న అవినీతి, బంధుప్రీతి, దుబారా, దోపిడీలు, అమాయకు లపై అరాచకాలు తదితర అవకతవకలపై — వైసీపీ ప్రభుత్వం తన దృష్టి సారించింది. ఇవన్నీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన పాదయాత్రలో ప్రజల కిచ్చిన హామీల్లో భాగమే.
ప్రభుత్వ ఖజానాకు ఏ రకంగా నష్టం చేకూరింది? ఎన్ని రకాలుగా ప్రజాధనం వృధా అయింది? ఏపి ప్రజలపై ఎన్నడూ లేని విధంగా ₹2.60 లక్షల కోట్ల ఋణభారం పడగా ప్రజలకు తద్వారా సంప్రాప్తించిన ఆస్తులు, ప్రయోజనాల విలువెంత? అనే 30 అంశాలపై విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్-కమిటీతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సబ్-కమిటీలో ఐదుగురు మంత్రులు ఉంటారు:
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
కురసాల కన్నబాబు,
మేకపాటి గౌతమ్ రెడ్డి,
అనిల్ కుమార్ యాదవ్
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
కూడా ఉన్నారు. ఈ కమిటీతో పాటు అధికారులతో కూడా సీఎం సమావేశమయ్యారు. నుండి 45 రోజుల్లో అంటే జూలై 1 నుండి ఆగష్ట్ 15 వరకు, సబ్-కమిటీ తమ పని పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి 4 లేదా 5 రోజులకు ఓసారి సబ్-కమిటీ సమావేశం కావాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి తాను కూడా స్వయంగా దీనిపై సమీక్ష చేస్తానని చెప్పారు.
గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన చెల్లింపులు, ఒప్పందాలు వంటి వాటిపై కేబినెట్ సబ్-కమిటీ సెక్రటేరియట్ లో వివిధ శాఖల అధికారులతో చర్చిస్తుంది. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులకు సంబంధించి అధికారులను కూడా విచారిస్తామని కమిటీ స్పష్టం చేసింది. ప్రజాధనం కాపాడాలనే ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం స్పష్టంగా ముందుకు వెళుతుందని మంత్రులు తెలిపారు.
వివిధ కంపెనీలకు భూ-కేటాయింపులు,
అమరావతిలో భూసమీకరణ,
ప్రాజెక్టులకు ఒకే టెండర్ రావడం,
నీటి పారుదల,
అర్బన్ హౌసింగ్
తదితరాలతో పాటు పుష్కరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ విషయాలపై విచారణ అనేది ప్రజాధనం విచ్చలవిడిగా, విచక్షణారహితంగా, వృధా చేసిన వ్యక్తుల, సంస్థల అవినీతి నిగ్గుతేల్చి, వారి నుండి నష్టమైన ప్రజాధనం తిరిగి రాబట్టే ప్రయత్నమే కాని ఎవరి పైనో కక్షసాధింపు కాదని.....మరో సంధర్భం లో వివరించారు.