ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన మొట్ట మొదటి సంతకం వృద్దాప్య పింఛన్ పై సంతకం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో తాను ఇచ్చిన నవరత్నాల హామీ అమలుపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల అమరావతిలోని ‘ప్రజావేదిక’ కూల్చివేత లాంటి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దుబారా అవుతున్న ఖర్చులపై కొరడా ఝులిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ కి తప్ప అతని కుటుంబ సభ్యులకు భద్రత తొలగించిన విషయం తెలిసిందే. కాగా, తనకు భద్రత కల్పించే విషయంలో సీఎం కొన్ని ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడానికి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబునాయుడు ఇంకా సీఎంగా ఉన్నారనే భ్రమలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు 50 మందితో భద్రత కల్పించాల్సి ఉంటే ప్రస్తుతం 74 మందితో భద్రతను కల్పిస్తున్నట్టుగా ఆమె వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉక్కుపాదం మోపమని సీఎం తమకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె అన్నారు. తనకు భద్రతను తగ్గించారనే విషయమై కోర్టులో బాబు పిటిషన్ వేయడాన్ని ఆమె తప్పుబట్టారు.