ఆంధ్రప్రదేశ్‌లో విత్తనాల కొరత రైతులను వెంటాడుతోంది. విత్తనాల కోసం క్యూలైన్‌లో నిలబడి పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకపోతుంది. ఆలస్యంగా వచ్చిన నైరుతికి తోడు విత్తనాలు కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాల కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రైతులు ఎదుర్కొంటున్న విత్తనాల కొరతపై స్పందిస్తూ.. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పవన్ కోరారు.

 

బకాయిలు చెల్లించకుండా, రైతాంగానికి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బాకీలు, విత్తనాలు కోసం పడుతున్న బాధలను తనను కలిసినప్పుడు రైతులు వివరించారని అన్నారు. రైతలుకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి, విత్తనాలను తగినంతగా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.

 

ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విత్తనాల కొరతతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పవన్‌కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో నిలుచుంటున్నా విత్తనాలు లభిస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో 4.96 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుకు 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేయగా కేవలం 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.

 

ఉత్తరాంధ్రలో వరి పంటకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవని అన్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే సమీక్షించాలని కోరారు. రైతులకు బకాయిల చెల్లింపు, విత్తనాల కొరత తీర్చటంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయ పనులు చేసుకునేలా చేయాలని పవన్ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: