కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. సంకీర్ణ సర్కారుకు షాకిచ్చారు. విజయనగర్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది గంటల వ్యవధిలోనే గొకాక్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోళి కూడా తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మంత్రి పదవి దక్కలేదనే కారణంతోనే వీరిద్దరూ పదవులకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన అనంతరం.. ఆనంద్ కుమార్ గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు.

 

ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ బలం 76కు తగ్గింది. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలుండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 113 స్థానాలు అవసరం. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రమేశ్ రాజీనామా లేఖ అందలేదని అసెంబ్లీ కార్యదర్శి చెప్పడం గమనార్హం. రమేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అనంతరం స్పీకర్ కార్యాలయం ప్రకటించింది.

 

అమెరికాలోని న్యూజెర్సీలో కాళభైరవ స్వామి ఆలయానికి శంకుస్థాపన చేయడం కోసం అమెరికా వెళ్లిన కుమారస్వామి.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తనకు తెలుసని ట్వీట్ చేశారు. ఆపరేషన్ కమలం కారణంగానే వీరిద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను అటు ఎమ్మెల్యేలు, ఇటు బీజేపీ కొట్టిపారేసింది.

 

ఈ పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం కూలిపోతే నూతన సర్కారును ఏర్పాటు చేసే హక్కు తమకుందని బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందనే అనుమానంతో.. గతంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్‌లో ఉంచింది. ఈ సమయంలో ఆనంద్ సింగ్‌‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కంప్లి గణేష్ దాడిచేసి గాయపర్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: