నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న స్కూల్స్, కాలేజీలపై అధికారులు కొరడా ఝలుపిస్తోంది వైసీపి ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఏపీలో పలు స్కూల్స్, కాలేజీలకు నోటీసులు జారీచేసిన అధికారులు, వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన రెండు కాలేజీలను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఆదేశాలతో అధికారులు వీటిని సీజ్ చేసి, మరో రెండు హాస్టల్స్‌కు నోటీసులు జారీ చేశారు.


ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌ బోర్డు రీజినల్ అధికారి ఎం.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో నాలుగు నారాయణ జూనియర్‌ కాలేజీలు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు అందినట్టు తెలిపారు.దీనిపై తక్షణమే నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారని అన్నారు.


దీంతో ఏవో అభయ్‌తో కలిసి కాలేజీలలో తనిఖీ నిర్వహించినట్టు వెల్లడించారు. న్యూ బాలాజీ కాలనీలోని నారాయణ మెడికల్‌ అకాడమీ, ఎమ్మార్‌పల్లి కూడలిలోని నారాయణ ఐఐటీ అకాడమీలు గుర్తింపు ఉన్న భవనంలో కాకుండా ఇతర భవనాల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నట్లు పరిశీలనలో గుర్తించామని వివరించారు. విద్యార్థులను ఖాళీ చేయించి వాటిని సీజ్‌ చేశామని, న్యూ బాలాజీకాలనీలోని ఒక భవనం, తనపల్లెలోని నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో భవనంలో అనుమతులు లేకుండా నడుపుతున్న హాస్టల్స్‌కు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు.


కాలేజీలు పునఃప్రారంభించిన తర్వాత గుర్తింపులేని కళాశాలలు నిర్వహించరాదని షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని కృష్ణయ్యచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వసతి గృహాలు నిర్వహించరాదని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: