టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తనపై ఉన్న అవినీతి కేసులకు భయపడే తనకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబు బీజేపీలోకి పంపారని సంచలన ఆరోపణలు చేశారు. ఆ నలుగురు ఎంపీలు టీడీపీ అధినేతకు అత్యంత ఆప్తులని.... చంద్రబాబుకు సంబంధించిన అన్ని వ్యక్తిగత , వ్యాపార, రాజకీయ విషయాలపై వారికి స్పష్టమైన అవగాహన వుందన్నారు.


నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో అక్కడ అవినీతి రాజ్యమేలిందని.. టీడీపీ నేతలు దేనిని వదలకుండా దోపిడీ చేశారని తలసాని ధ్వజమెత్తారు. ఇప్పుడు అధికారం కోల్పోవడం.. కొత్త ప్రభుత్వం బాబు పాలనపై ఎంక్వైరీ కమిటీ వేయడంతో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని తన మిత్రులకు కాషాయ కండువా కప్పించారని తలసాని ఆరోపించారు.


ఇక తెలంగాణలో కాలం చెల్లిన నేతలకు బీజేపీ కండువా కప్పుతోందని శ్రీనివాస్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 25 ఏళ్ల నుంచి తెలుగునాట ఎదగడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఇంకా తెలియడం లేదా అని ఆయన ప్రశ్నించారు.  డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా... బీజేపీ నేతలు ఇంకా గుణపాఠం నేర్వేలదని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీ నేతలకు నిరీక్షణ తప్పించి నో యూజ్ అని తలసాని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: