ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపు నేతలు కూడా పవన్ను నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుతం చంద్రబాబు తీవ్రమైన సంకట స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలోనే కాపు నేతలంతా ఒకేతాటిమీదకు వచ్చి తమ మాటను నెగ్గించుకునేలా చేయడంతో పాటు పార్టీలో తమ ఆధిపత్యానికి బీజం వేసే పనిలో ఉన్నట్టు ఆ పార్టీలో పరిణామాలు స్పష్టం చేస్తున్నాయ్. ఏపీలో మెజార్టీ జిల్లాల్లో వారి డామినేషన్ ఉండడంతో చంద్రబాబు కూడా తలొగ్గక తప్పనిసరి పరిస్థితే ప్రస్తుతం ఉంది.
తెలుగుదేశంలో కాపుల కదలికలు.. ఎందుకు..? ఎటువైపు..? ఎవరికోసం..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పార్టీశ్రేణులతోపాటు రాజకీయవర్గాల మెదళ్లను తొలుస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడే ఎందుకు కాపునేతలు హడావుడి చేస్తుండడం ఆసక్తిరేపుతోంది. తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతోందని, మరేదో మార్పు కోరుతున్నారనే సంకేతాలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 2109 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాతనే ఈ పరిణామాలు, సామాజిక సమీకరణాలు వేగంగా తరుముకొస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ అంటేనే.. బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనే గుర్తింపు ఉంది. బీసీలను పక్కన పెడితే టీడీపీలో ఎప్పుడూ కమ్మల హవానే నడుస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాక ఆ వర్గాల్లో మెజార్టీ టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారు. పార్టీలో బీసీలకు చంద్రబాబు బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కాస్తంత కాపుల ఆధిపత్యం పెరిగింది. బాబు కాపులకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇదే సమయంలో బాబు కాపులకు ప్రాధాన్యం ఇవ్వడంతో బీసీలు కూడా దూరమయ్యారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్తో కూడా బీసీ వర్గాలు మొత్తం వైసీపీకి జైకొట్టారు. దీంతో అటు బీసీవర్గాలు, కాపులు తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కాపు నేతలు ఈ మధ్య తెగహడావుడి చేస్తున్నారు.