టీడీపీ పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక ఆ పార్టీని బతికించే వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని చాలా మంది విశ్లేషించారు. అయితే గతంలో టీడీపీ పార్టీ పట్ల ఇంట్రెస్ట్ చూపి ప్రచారం కూడా చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. ఎన్టీఆర్ దూరమవడంపై భిన్న వాదనలు వినిపించాయి.. కానీ దేనికీ స్పందించలేదు. అయితే తాజాగా జరిగిన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పరాభవం చూసి టీడీపీని కాపాడే సత్తా ఎన్టీఆర్ కి మాత్రమే ఉందనే టాక్ బలంగా వినిపిస్తూ వచ్చింది.
ఈ లోగా.. టీడీపీ పార్టీలో కీలక భూమిక పోషించి గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన కొడాలి నాని ఆత్మీయ అభినందన సభలో జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశిస్తూ పేర్ని వెంకట్రామయ్య చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ ని నటుడిగా తీర్చిదిద్దింది కొడాలి నాని అని, వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం విడదీయరానిదని ఆయన పేర్కొనడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవలే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీ తీరడం పుచ్చుకొని కీలక బాధ్యతలు చేపట్టారు.
అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర బంధువులు, కొంత మంది స్నేహితులు వైసీపీలో యాక్టివ్ గా ఉండటం పట్ల తారక్ సంతోషంగా ఉన్నాడని వైసీపీ నేతలు అంటున్నారు. అంటే వైసీపీ పార్టీ విజయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఆనందంగా ఉన్నారనేది కొందరు వైసీపీ నేతల మాట. ఓటమి తర్వాత టీడీపీ బాధ్యతలు చేపట్టాలని వచ్చిన వార్తల పట్ల ఎన్టీఆర్ స్పందించకపోవడం, అదేవిధంగా కొందరు వైసీపీ నేతలు ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ అంశం ప్రాతిపదికనే.. తారక్ని ఎలాగైనా వైసీపీలోకి లాగేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఓ మీడియా కథనం వెలువడింది.