వైసీపీ కుర్ర ఎంపీ గురువారం లోక్‌సభలో స్పీకర్ స్థానంలో కనిపించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ గా ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన తొలిసారిగా గురువారం ఈ హోదాలో లోక్‌సభను నిర్వహిస్తున్నారు.


లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన.. ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారు.


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులైన నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మిధున్ రెడ్డి రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించారు.


2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. మిథున్ రెడ్డిని స్పీకర్ స్థానంలో చూసి మురిసిపోయిన వైసీపీ నేతలు ముందు ముందు స్పీకర్ గా ఎన్నికయ్యే రోజు రావాలని కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: