తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

 

దీనిపై ఆయన మాట్లాడుతూ...‘ నిజమే..అమ్మ(జయలలిత)మృతి మిస్టరీలా ఉందని నేనెప్పుడో చెప్పాను. అందుకే దీనిపై విచారణ చేపట్టాలని కోరాను. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు నేను ఒక్కసారి కూడా వెళ్లి చూడలేదు. ఇక అమ్మ మృతిపై విచారణకు ఆర్ముగస్వామి కమిషన్‌ను వేశారు.

 

వాళ్లు నన్ను నాలుగు సార్లు పిలిచారు. కానీ నాకు ముఖ్యమైన పని ఉండటంతో వెళ్లలేదు. మరోసారి నన్ను పిలిస్తే, నేను కచ్చితంగా వెళతాను’ అని తెలిపారు. 2016 డిసెంబరు 5న జయలలిత మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు.

 

అయితే ఆమె మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. కమిషన్‌ వేసి విచారణ జరపాలని కోరారు. తొలుత ప్రభుత్వం ఇందుకు ఆలస్యం చేసింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. 2017 సెప్టెంబరులో ఎట్టకేలకు ఆర్ముగస్వామి కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: