భారత ఆర్మీలో మహిళా సైనికుల సంఖ్య చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మహిళలు సైన్యంలో చేరేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా ఆర్మీ మహిళా విభాగాల్లో 100 ఉద్యోగాలకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్కు భారీ స్పందన లభించింది. ఏకంగా ఆ పోస్టులకు రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టులన్నీ యుద్ధ రంగంలో ప్రత్యక్షంగా తలపడే జవాను ఉద్యోగాలే.
ఇప్పటికే ఐఏఎఫ్( భారత వాయు సైన్య దళం) ఆరుగురు మహిళలు సైనిక పైలట్లుగా శిక్షణ పొందుతున్నారు. 15 లక్షల మందితో మరొక బలమైన ఆర్మీ ( కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్) తయారు చేసేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రాల వారీగా ‘మహిళా ప్రోవెస్ట్ యూనిట్’ను ఇద్దరు అధికారులు, ముగ్గురు జూనియర్ కమిషన్ అధికారులతో 40 మంది సైనికులు ఉండేలా తయారు చేయబోతుంది.
ఇప్పటిదాకా భారతసైన్యంలో మహిళలను నియమించి కేవలం వారిని కార్యాలయాలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు నేరుగా యుద్ధక్షేత్రంలో పాల్గొనే వీరికి కఠినమైన శిక్షణ ఇవ్వనున్నారు. నియామకాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ర్యాలీ ఈ నెలాఖరున బెల్గాంలో జరగనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 25 నుంచి మొదలైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ సీఎమ్పీకి సంబంధించి రానున్న 17 సంవత్సరాల సర్వీసుకు గానూ 1700 మందిని ‘కింది స్థాయి ర్యాంకుల’ కేటగిరి కింద నియమించేందుకు ఆర్మీ రంగం సిద్ధం చేస్తుంది. వివిధ ప్రాంతాల్లో జన సమూహాల్ని నియంత్రణ చేసేందుకు, ముఖ్యంగా జమ్ముకశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో వీరిని వినియోగిస్తారు. వీరికి బెంగుళూరులోని సీఎమ్పీ కేంద్రంలో శిక్షణ ఇస్తారు.