ఆకాశ హర్మ్యాలు, వంతెనలు, భూగర్భ మార్గాలు, భూతల స్వర్గం..! మెట్రో రైలు మార్గమైనా ప్రజల సౌకర్యానికే.. వర్తమానం నుంచి భవిష్యత్తు వరకు ఆయా అభివృద్ధి పనులతో షరతుల్లేని ప్రయోజనాలు చేకూరాలి. అందుకే ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తోంది. మైండ్స్పేస్ కూడలి అభివృద్ధి పనులు మాత్రం అలా కనిపించట్లేదు.
అండర్పాస్ మార్గం, సర్వీసు రోడ్డుకు అడ్డుగా మెట్రో రైలు సంస్థ స్టేషన్ మెట్లను నిర్మిస్తోంది.దీంతో రోడ్డు ప్రమాదాలకు, ట్రాఫిక్ సమస్యలకు అధికారులే ఆస్కారం కల్పించినట్లవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దూరదృష్టి లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలలూ వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా మహా నగరంలో రహదారి వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు 2015లో రూ.25వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్సార్డీపీ) ప్రారంభించింది.అందులో ఐటీ కారిడార్కు సంబంధించిన ప్రాజెక్టులు ఎంతో కీలకమైనవి.
అదే స్థాయిలో.. ఎవరూ ఊహించని రీతిలో మైండ్స్పేస్ కూడలి - దుర్గం చెరువు మధ్య నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి పూర్తయి కార్యాలయాలు ప్రారంభమైతే ఎక్కువ మంది సొంత వాహనాల్లో వస్తారని అంచనా. అదే జరిగితే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్కే కిక్కిరిసిపోతున్న ఐటీ కారిడార్లో పరిస్థితి భవిష్యత్తులో ఎంత తీవ్రంగా మారనుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.అదేమీ పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ, మెట్రో రైలు సంస్థలు ముందుకెళుతున్నాయా అనే ప్రశ్న రేకెత్తుతోంది.