అన్నదాతల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న శనగ రైతులను అందుకునేందుకు ముందుకు వచ్చారు. గొడౌన్లు, కోల్డ్ స్టోరేజ్‌‌లలో మగ్గుతున్న శనగలను మార్కెట్ రేటుకు అదనంగా క్వింటాలుకు రూ.1500 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల్ని ఆదుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి శనగ రైతుల జాబితా మేరకు చెల్లించాలని ఆదేశించారు. ప్రతి ఎకరాకు ఆరు క్వింటాళ్లు లేదా 30 క్వింటాళ్లకు మించకుండా శనగ రైతులకు చెల్లింపులు జరపాలని సూచించింది. ప్రభుత్వ నిర్ణయంపై శనగ రైతులు హర్షం వ్యక్తం చేశారు.

 

పంటకు సరైన గిట్టుబాటు ధరలేక ఇన్నాళ్లూ నష్టాల్లో ఉన్నామని.. ప్రభుత్వం తమ బాధను అర్ధం చేసుకొని.. సమస్యకు పరిష్కారం చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ శనగ రైతులు తమ గోడను ఆయనతో వెళ్లబోసుకున్నారు.

 

పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని.. తమను ఆదుకోవాలని కోరారు. వారి సమస్యపై సానుకూలంగా స్పందించిన జగన్.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఆదుకుంటామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యపై స్పందించిన కీలక నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: