రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికీ అర్ధం కాదు. ఒకసారి తీసుకున్న నిర్ణయం మరోసారికి మారిపోతుంది. మారడం సహజమే కానీ, ఇలా ఫాస్ట్ గా మార్పులు చోటు చేసుకోవడమే ఇబ్బంది కలిగించే అంశం. జగన్ తో వెన్నంటే ఉన్న విజయసాయి రెడ్డికి పట్టుబట్టి ఢిల్లీలో ఎపి ప్రతినిధిగా స్థానం కలిపించారు.
ఇది క్యాబినెట్ హోదాతో కూడిన పోస్ట్. దీనికి విజయసాయి రెడ్డి కూడా సరే అన్నారు. ఈనెల 27 వ తేదీన ప్రభుత్వం జీవో ను జారీ చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే సడెన్ గా జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విజయసాయి రెడ్డి ఎంపీ హోదాలో ఉన్నారు కాబట్టి.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా వేరే వాళ్ళను నియమించబోతున్నారని వార్తలు వచ్చాయి.
జీవో వెనక్కి తీసుకోవడానికి అది కారణం కాకపోవచ్చు. మరేదైనా బలమైన కారణం ఉండొచ్చన్నది కొందరి వాదన. ఈ వాదనలు పక్కన పెడితే.. విజయసాయి రెడ్డి స్థానంలో ఎవరికి ఆ పోస్ట్ ఇవ్వబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ విషయంపై ఇప్పటికే కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి.
విజయసాయి రెడ్డి ప్లేస్ లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. రేపోమాపో ఆయన నియామకం ఖరారు చేస్తారని అంటున్నారు. మోదుగుల గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కేవలం 5 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓటమిపాలయ్యారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించలేదని అందుకే ఆయన ఓడిపోయారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నది.