హైద్రాబాదు నగరంలో పాదచారుల భద్రతకు పెద్దపీట వేయాలని ట్రాఫిక్‌ విభాగం అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పోలీసులు పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు పై దృష్టి సారించారు. ఇప్పటికే ఠాణాల వారీగా అధ్యయనం పూర్తి చేసి ఎనిమిది ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలోని తొమ్మిది చోట్ల ఇవి అవసరమని తేల్చారు. ఈ మేరకు రూపొందించిన నివేదికలను జీహెచ్‌ఎంసీకి పంపారు. సిటీలో నిత్యం పాదచారుల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం.

 

గత ఏడాది నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పెడస్ట్రియన్స్‌ 36 శాతానికి పైగా ఉన్నారు. నగర ట్రాఫిక్‌ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారిపై గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాతపడ్డారు.

 

సిటీలో గత ఏడాది మొత్తం 2540 ప్రమాదాలు చోటు చేసుకోగా... 2550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాలబారిన పడిన పాదచారుల సంఖ్య 924. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్‌ విభాగం అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెహదీపట్నం రైతు బజార్‌ వద్ద ఓ పెలికాన్‌ సిగ్నల్‌ అందుబాటులో ఉంది.

 

పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరించే పెలికాన్‌ సిగ్నల్స్‌ సాధారణంగా రెండు రకాలైనవి ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటాలని భావించినప్పుడు వారే రెడ్‌ లైట్‌ వచ్చేలా సిగ్నల్‌లోని బటన్స్‌ నొక్కే ఆస్కారం ఉన్నవి మాన్యువల్‌గా పని చేస్తుంటాయి. మరోపక్క నిర్ణీత సమయం తర్వాత కొన్ని సెకన్ల పాటు అన్ని రెడ్‌లైట్‌ వచ్చి పాదచారులు రోడ్డు దాటడానికి ఉపకరిస్తుంటుంది. ఈ రెండు విధాలైన సిగ్నల్స్‌లో ఉన్న మంచి చెడులతో పాటు వాటిని ఏర్పాటు చేసే ప్రాంతాల పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏ తరహాకు చెందినవి ఏర్పాటు చేయాలన్నది ఖరారు చేయనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: