ఏపీలో అధికారానికి దూరమైన చంద్రబాబు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారా.. రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కల్పించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నారా.. ప్రజల్లో సానుభూతి పొంది.. తద్వారా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారా.. ?
ఈ ప్రశ్నలకు అవునని సమాధానం ఇస్తోంది వైసీపీ. ఇందుకు సాక్ష్యంగా ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ప్రస్తావిస్తోంది. ప్రతిపక్ష నేతకు సెక్యూరిటీ తగ్గిస్తున్నారు అంటూ చేసుకున్న ప్రచారం.. ఇప్పుడు తనపై దాడి జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరు అంటూ స్వయంగా చంద్రబాబు వాఖ్యానించడాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది.
ఇది ముందస్తు కుట్రగా కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలను రాష్ట్రంలో అలజడులు, అల్లర్లు సృష్టించేందుకు బాబు సమాయత్తం చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నాయని వైసీపీ చెబుతోంది. చంద్రబాబుపై చిన్నపాటి దాడి లాంటిది జరగడం దాన్ని భద్రతా వైఫల్యంగా ప్రచారం చేస్తూ, టీడీపీ శ్రేణులు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా గొడవలు చేయడం ఈ ప్లాన్ లో భాగం కావచ్చని అనుమానిస్తోంది వైసీపీ.
చంద్రబాబు తనకు ఇచ్చే సెక్యూరిటీ విషయంలోనూ.. రచ్చ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. నిజానికి ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నేతకు ఇచ్చే భద్రత, సెక్యూరిటీ విషయంలో చాలా తేడాలు ఉంటాయని గుర్తు చేస్తోంది. జగన్ ప్రభుత్వం చంద్రబాబు భద్రతకు ఏ లోటూ రానీయలేదని చెబుతోంది.