స్వామి వచ్చేలోపు ఆ కాస్త పుణ్యకాలం గడిచిపోతుందట! కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా పత్రాలు సమర్పించారు. అనంతరం వారు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వాజూభాయ్‌ వాలాను కలిశారు. ‘ఇటీవలి రాజీనామా సమర్పించిన ఆనంద్‌ సింగ్‌తోపాటు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 14 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేశారు’ అని జేడీఎస్‌ ఎమ్మెల్యే ఏహెచ్‌ విశ్వనాథ్‌ గవర్నర్‌తోను కలిశాక మీడియాకు చెప్పారు.

 

'ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు’ అని విశ్వనాథ్‌ అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ మచ్చిక చేసుకుంటోందన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ కమలం వంటివన్నీ ఊహాగానాలు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం’ అని అన్నారు.

 

అయితే, ఆనంద్‌ సింగ్‌ సహా 13 మంది ఎమ్మెల్యేలే రాజీనామా లేఖలను అందజేసినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్‌ వర్గాలు చెప్పాయి. ఈ పరిణామంపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో కార్యాలయంలో లేను. మొత్తం 11 మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఆఫీస్‌లో ఇచ్చారు.

 

ప్రభుత్వం కొనసాగేదీ లేనిదీ అసెంబ్లీలోనే తేలుతుంది. మంగళవారం ఆఫీసుకు వెళ్లి రాజీనామా లేఖలను పరిశీలించి, చర్య తీసుకుంటా’ అని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌లో ‘ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌ రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముఖ్యులైన రామలింగారెడ్డి తదితరులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌ బెంగళూరుకు చేరుకోనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: