తాజా కేంద్ర బడ్జెట్పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనూ, నేతల్లోనూ తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లుగా మోడీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతలా మొండిచేయి చూపిస్తుందో ? చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరోసారి అదే పంథాలో వెళ్లింది. కీలక ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల గురించి కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావనా లేకుండా పోయింది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్తో పాటు ఏపీలో అధికార వైసీపీ నేతలు బడ్జెట్పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు వేశారు. కేటీఆర్ గతంలో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ధరల పెరుగుదలపై చేసిన ట్వీట్ను ఇప్పుడు రీట్వీట్ చేస్తూ మరి నిర్మలకు షాక్ ఇచ్చారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఉద్దేశిస్తూ.. ‘‘గుజరాత్ సీఎంగా మోడీ చేసిన వ్యాఖ్యలను ఓ సారి గుర్తుచేస్తున్నాను. పెట్రోలో, డీజిల్ ధరల పెంపుతో భారతీయులపై అమితమైన భారం పడుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దానికింద అప్పటి మోదీ ట్వీట్ను అప్లోడ్ చేశారు. అప్పటి మోడీ ట్వీట్లో ‘‘విపరీతంగా పెట్రోల్ ధరల పెంపు.. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తోంది. ఇది కోట్లాదిమంది గుజరాతీయులకు పెను భారం కానుంది’’ అని ఉంది.
దీనిని బట్టి అప్పుడు యూపీఏ ప్రభుత్వంపై మోడీ తన రాష్ట్ర ప్రజల తరపున వేసిన ట్వీట్ను ఇప్పుడు కేటీఆర్ అదే మోడీ ప్రభుత్వంపై కౌంటర్గా వాడుకునేందుకు ఉపయోగించారు. దీనికి నెటిజన్ల నుంచి సూపర్ కేటీఆర్ అని అదిరిపోయే కామెంట్లు వస్తున్నాయి.