ఏపీ రాజకీయాలు తమిళనాడుని పోలి ఉండడం విశేషం. అక్కడ పార్టీలను మించిపోయి వ్యక్తిగత కక్షలు ముదిరిపోయాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా రెండవ వారి మీద రెచ్చిపోవడం తమిళనాట పొలిటికల్ సీన్. అసెంబ్లీలో జయలలితపై అనుచితంగా ప్రవర్తించినందుకు ఆమె సీఎం కాగానే అర్ధరాత్రి, వ్రుద్ధుడు అని చూడకుండా పోలీసులను పంపించి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఏపీలో కూడా గత అయిదేళ్ళలో చంద్రబాబు జగన్ని ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని గట్టిగా ట్రై చేశారట. ఆ విషయాన్నీ తాజాగా బీజేపీలోకి మారిన చెన్నంశెట్టి శశికుమార్ వెల్లడించారు . గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ ను ఎలా కేసులలో ఇరికించాలన్నదానిపై టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించిన విషయాన్ని ఈ మాజీ టిడిపి నేతే బయటపెట్టారు
ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్మోహన్రెడ్డిని అక్రమంగా ఇరికించేలా సీఐబీ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆ కేసులో సాక్షి గా ఉన్న టీడీపీ నేత చెన్నంశెట్టి శశికుమార్ సంచలన ఆరోపణ చేశారు. కేసు విచారణలో ఆయన పేరు చెప్పలేదని అప్పటి నుంచి తనపై పార్టీ పెద్దలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
చంద్రబాబు చెప్పినట్టు వినలేదనే ఐదేళ్ల కాలంలో తనకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్దలు కేవలం వారి సామాజిక వర్గానికి పదవులు కట్టబెడుతూ, రాజకీయాల్లో కనీస అవగాహన లేని లోకేష్కు మంత్రి పదవి ఇచ్చి పార్టీలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పనిచేసిన కార్యకర్తలను, నేతలను విస్మరించారని ఆయన అన్నారు.
మొత్తానికి బాబు ఓడిపోవడం కాదు కానీ ఆయన గతమంతా తవ్వేందుకు టీడీపీ మాజీలు ట్రై చేస్తున్నారు. పార్టీ వదిలి పోతూ పోతూ బాబుని అనాల్సిన మాటలన్నీ అనేసేస్తున్నారు. బాబుకు ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తున్నారు. జగన్ని ఇరికించడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇపుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్. పైగా జగన్ పవర్లో ఉన్నారు.