అందరూ చంద్రబాబుకు ఫ్రెండ్స్. బాబు దేశంలోకెల్లా సీనియర్ నేత. నాకెందుకు ప్రధాని పదవి అంటూనే మనసు నిండా ఆశలు పెంచుకున్న నాయకుడు. అయితే ఆయన ఇపుడు ఏపీలో అధికారం కోల్పోయారు. ఆయన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు.
పైగా ఆయన రాజకీయ స్నేహితులు ఇపుడు జగన్ వైపు చూస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే తమిళనాడు నుంచి డీఎంకే స్టాలిన్ వచ్చారు. ఇక జగన్ సీఎం హోదాలో ఢిల్లీ వెళ్తే కర్నాటక సీఎం కుమారస్వామి ఆయనతో కలసి విందు చేశారు. ఇక కేసీయార్ తో జగన్ దోస్తీ అందరికీ తెలిసిందే.
తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జగన్ వైపు చూస్తున్నట్లుగా ఉంది ఆమెను ఏపీకి రప్పించి బాబు తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఏపీలో మారిన వాతావరణంలో ఇపుడు మమత జగన్ సీఎం కావడంతో ఆయనతో చెలిమి కోసం యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు జరిగిన ఓ రాజకీయ పరిణామం దాన్ని బలపరుస్తోంది.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రొజు నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ట్వీట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆమె ట్యాగ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మమత సైతం యువ నాయకుడు జగన్ తో స్నేహాన్ని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.