ఇప్పటికే...ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తాలుకూ పరాభవాన్ని ఎలా భరించాలో తేల్చుకోలేక సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనపై డ్రగ్స్ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొకైన్ తీసుకుంటారనీ, ఆ మత్తులో పార్టీని నడపడంతోనే కాంగ్రెస్ నాశనమైపోయిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. ఈ విషయంలో చేస్తున్న ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే, రాహుల్ కొకైన్ తీసుకుంటాడని స్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసన గా గాంధీ భవన్ ముందు ఆయన కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మను దగ్దం చేశారు. స్వామి వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పందిస్తూ.. బీజేపీ దేశ వ్యాప్తంగా నీచమైన రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు. రాహుల్ ను కించపరచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గానూ అబిడ్స్ పోలీసు స్టేషన్లో సుబ్రహ్మణ్యస్వామి మీద ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. సుబ్రహ్మణ్య స్వామి మీద చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. పెళ్లిలో అక్షింతలు వేయమంటే పెళ్లి కూతురికి తాళి కట్టబోయిన సుబ్రహ్మణ్యస్వామి.. రాహుల్ గాంధీని విమర్శించడం సూర్యుడి పైన ఉమ్మి వేయడం లాంటిదని యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి దేశంలో ఎక్కడా తిరక్కుండా అడ్డుకుంటామని అనిల్ అన్నారు.
ఇదిలాఉండగా, రాహుల్ గాంధీపై కొకైన్ వ్యాఖ్యలు చేయడంతో స్వామిపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఛత్తీస్గఢ్ పోలీసులు సుబ్రహ్మణ్య స్వామిపై కేసు నమోదుచేశారు. అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేయడంపై సుబ్రహ్మణ్య స్వామి విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ స్టుపిడ్ అనీ, రాహుల్ గాంధీకి పోలీసులు డోపింగ్ పరీక్ష నిర్వహించలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి డోపింగ్ పరీక్ష నిర్వహించి ఉంటే వాస్తవం బయటకు వచ్చేదని వ్యాఖ్యానించారు.