కర్ణాటకలో రాజకీయాలు ఎప్పుడు ఎలా మార్పులు చెందుతాయో ఎవరికీ తెలియడం లేదు. ఒక్కోసారి ఒక్కోలా మారిపోతుంటాయి. అంతా బాగానే ఉంది కదా అనుకున్న సమయంలో సడెన్ గా కాంగ్రెస్ నుంచి జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.
త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలియడంతో కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు మెల్లిగా పావులు కదుపుతోంది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం బీజేపీకి అక్కడ 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండిపెండెంట్ గా ఉన్న ఎమ్మెల్యే బీజేపీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో బలం 106 కు పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 106 మంది ఎమ్మెల్యేల బలం సరిపోతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యొచ్చు.
అయితే, నిన్న ప్రభుత్వానికి చెందిన మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. మొన్న రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలకు కొత్తగా మంత్రి పదవులు ఇస్తామని చెప్పడంతో రాజకీయం కొత్త కోణంలోకి వెళ్ళింది. రాజీనామాలు చేసిన వాళ్ళను బుజ్జగించి వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే..అధికారాన్ని కాపాడుకోవచ్చని సంకీర్ణ ప్రభుత్వం చూస్తోంది.