జనసేన నుండి గెలిచిన ఏకైక ఎంఎల్ఏ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే ఇచ్చారు. జగన్ కు ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ జై కొట్టడం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ నేతలు ఇపుడిదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకెళ్ళినట్లు సమాచారం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే వైఎస్సార్ ఫించన్ల పథకం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాలో తన నియోజకవర్గమైన రాజోలులో రాపాక కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాపాక మాట్లాడుతూ పేద ప్రజలకు ఎవరు మంచి పనులు చేసినా వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సిందే అన్నారు. కుల, మతాలకు, పార్టీల రహితంగా సంక్షేమ పథకాలు అందచేయాలన్న జగన్ ఆలోచనకు అందరూ మద్దతుగా నిలబడాలన్నారు.

 

వైఎస్సార్  కూడా ఇలాంటి పథకాల వల్లే జన హ్రుదయాల్లో నిలిచిపోయినట్లు రాపాక చెప్పారు. ఇపుడు జగన్ కూడా తండ్రి వైఎస్సార్ లాగే సంక్షేమ పథకాల అమలులో జనాలకు బాగా దగ్గరవుతున్నట్లు కితాబివ్వటం గమనార్హం. ఎప్పుడైతే జగన్ ను పొగుడుతూ రాపాక మాట్లాడారు వెంటనే పార్టీలో సంచలనంగా మారింది.

 

నిజానికి రాపాక వైసిపి నేతే. కాకపోతే మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వటం సాధ్యం కాదని జగన్ చెప్పటంతో వెంటనే రాపాక జనసేనలోకి జంప్ చేశారు. గతంలోనే గెలవటంతో పాటు నియోజకవర్గంలో మంచి క్యాడర్ బేస్ డు లీడర్ కావటంతో జగన్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని జనసేన తరపున గెలిచారు. గెలిచిన దగ్గర నుండి వైసిపిలో చేరటానికి రాపాక ప్రయత్నిస్తున్నట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. చూడబోతే ఏదో ఓ రోజు రాపాక వైసిపిలో చేరిపోవటం ఖాయంగానే తోస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: