విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని గ‌త కొద్దికాలంగా సంచ‌ల‌న ప‌రిణామాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తనకు టీడీపీ అధిష్టానం పార్లమెంటరీ విప్‌ పదవిని ఇవ్వడంపై కేశినేని నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు అంత పెద్ద పదవి వద్దని, ఆ బాధ్యతలను తాను మోయలేనంటూ పేర్కొన్నారు. ఇక అప్పటి నుంచి పార్టీకి అంటీముట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలపై వరుస పోస్టులతో విరుచుకుపడుతున్నారు. 


ఇటీవ‌లి కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం గురించి స్పందిస్తూ...`మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లోకి చేరారో అని`` జంపింగ్ ఎంపీల‌పై నాని స్పందించిన సంగ‌తి తెలిసిందే. ఇలా నేరుగా విరుచుకుప‌డిన నాని తాజాగా న‌ర్మ‌గ‌ర్భంగా ఓ పోస్ట్ పెట్టారు. ``ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీకి కావాల్సింది షో చేసే వాళ్లు కాదని.. పరిస్థితులను ఎదుర్కొనేవాళ్లని ఆయన తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. 


నాని ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఎవ‌రిని ఉద్దేశించింది అంటూ ప‌లువురు నెటిజ‌న్లు ఆస‌క్తిక‌రంగా స్పందించుకుంటున్నారు. టీడీపీలోని కొంద‌రు నేత‌ల తీరును ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ పెట్టార‌ని కొంద‌రు అంటుంటే...టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను ఉద్దేశిస్తూ ఈ రీతిలో వ్యాఖ్యానించార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇంత‌కీ ఈ పోస్ట్ టార్గెట్ బాబు, లోకేష్ అని అనుకోవాలా?లేక మ‌రెవ‌రు?  నాని మాత్ర‌మే క్లారిటీ ఇవ్వ‌గ‌ల‌రేమో!


మరింత సమాచారం తెలుసుకోండి: