ఏపీ ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని విస్మయకర పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే బాబు హయాంలోని అవినీతి బట్టబయలు అవగా...తాజాగా ఆయన అండతో చోటుచేసుకున్న పరిణామాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో సంచలన ఆందోళన జరిగింది. మాజీ ఏసీబీ డీజీ ఆర్పీ ఠాగూర్కు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తింది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలనుంచి తరలివచ్చిన ఠాగూర్ బాధితులు ఆందోళన చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పుకోసం అక్రమ కేసులు బనాయించారంటూ ఫ్లెక్సీలతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలకు సహకరించలేదని ఠాగూర్ ఎన్నో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఠాగూర్ పెట్టిన తప్పుడు కేసులపై రివ్యూ చేయాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీకి తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ఠాగూర్ ని సస్పెండ్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో స్పందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాము పరిష్కారం కోసం ఈ విధంగా రోడ్డెక్కామని తెలిపారు.
ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ, ఠాగూర్ అక్రమాలను సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఏసీబీలో ఇప్పటికీ చంద్రబాబు, ఠాగూర్ మనుషులే అజమాయిషీ చెలాయిస్తున్నారని ఆరోపించారు. అందువల్లే అక్రమంగా తమపై పెట్టిన కేసులు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని, వెంటనే బదిలీలు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.