మాట తప్పను, మడమ తిప్పను, ఇదీ వైఎస్ కుటుంబం నినాదం. జగన్ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. వాటికి అనుగుణంగా అధికారంలోకివ్ అచ్చిన మరుసటి రోజు నుంచి అమలు చేస్తూనే ఉన్నారు. ఇపుడు మరింతగా ముందుకు అడుగులు వేస్తున్నారు .
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడంతోపాటు, నామినేటెడ్ పోస్టుల్లో యాభైశాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందేలా ఉద్దేశించిన బిల్లునూ ఈ శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఆయా వర్గాలకు ఈ చట్టంద్వారా పెద్ద ఎత్తున రాజకీయ ప్రాధాన్యత కల్పించబోతున్నామని ఆయన ఇదివరకే స్పష్టంచేశారు.
అంతకంతకూ పెరిగిపోతున్న స్కూలు ఫీజులను కట్టడిచేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సామాజిక వేత్తల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు, ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటినుంచి వైఎస్ జగన్ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో ఒక సమర్థవంతమైన చట్టాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో స్కూలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఒక చట్టం చేయబోతున్నారు.
దీనికోసం తయారుచేసిన బిల్లుపై అధికారులతో సీఎం వివరంగా మాట్లాడారు. అలాగే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలను స్థానికులకు కల్పించే దిశగా మరొక చట్టాన్ని తెచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. కౌలు రైతులకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో చెప్పిన నేపథ్యంలో రైతు భరోసాను వారికి అందిస్తామని ఇదివరకే ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
దీనిలో భాగంగా భూయజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, పంటపై 11 నెలలపాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించేలా మరొక చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ముసాయిదా బిల్లుపై కూడా సీఎం అధికారులతో సమీక్షించారు. మొత్తానికి జగన్ తాను చేతల మనిషిని అని రుజువు చేస్తున్నారు.