ఐటీ సహా పెట్టుబడులు, నూతన సంస్థల రాకలో దేశం చూపును హైదరాబాద్ ఆకర్షిస్తోందనే ప్రశంసతో పాటుగా అదే రీతిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు, అనుమతులు లేకుండా నివసించే వారికి సైతం హైదరాబాద్ వేదికగా మారిందనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన జాతిగా పేరొందిన రోహింగ్యాలు సైతం హైదరాబాద్లో హాయిగా తిరుగుతున్నారనే వార్తలు చెలామణిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4వేల మంది రోహింగ్యాలు ఉన్నారని పలువురు చెప్తున్నారు. వీరితో పాటుగా అనుమతులు లేకుండా ఉండే వారెందరో. అయితే, తాజాగా వీరిపై కేంద్రం నజర్ పెట్టింది. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆదేశాలు వెలువడటంతో...అక్రమంగా ఉన్నవారి గురించి నిఘా మొదలైంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఆదేశాల మేరకు నగరంలో నివసిస్తున్న విదేశీయుల వివరాలు సేకరించేందుకు నగర పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. టాస్క్ఫోర్స్, సిటీపోలీస్, ఇమిగ్రేషన్ అధికారులు కలిసి గోల్కొండ, ఆసిఫ్నగర్, నాంపల్లి, హుమాయన్నగర్.లంగర్హౌస్లో ఉంటున్న వారిని గుర్తించి నాంపల్లి ప్రాంతంలోని ఒక ఫంక్షన్హాల్లో వివరాలు సేకరించారు. ఫింగర్ ఫ్రింట్స్, అడ్రస్లు, వారు చేస్తున్న పని వివరాలు సేకరించారు. 92 మంది అక్రమ నివాసితులు ఉన్నారన్న సమచారం మేరకు తనిఖీలు చేపట్టగా కేవలం 65 మంది వివరాలు మాత్రమే లభించాయి. మిగతా వారి వివరాల కోసం మళ్లీ గాలింపు చేపట్టనున్నారు.
ఇదిలాఉండగా, తెలంగాణ రాష్ట్రంలో రోహింగ్యాలు పెద్ద ఎత్తున్నే తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల బాలపూర్లో మత్తు మాత్రలు విక్రయిస్తుండగా ఇద్దరు రోహింగ్యాలు అరెస్టు చేసిన పోలీసులు ఆయా ప్రాంతాలలో ఉన్న రోహింగ్యాలపై దృష్టిసారించారు. పోలీసుల దర్యాప్తులో మేడ్చల్ నియోజక వర్గ పరిధిలో వందలాది మంది రోహింగ్యాలు ఓటుహక్కు కలిగి ఉన్నట్లు విచారణలో వెలుగుచూసింది. ముఖ్యంగా రాచకొండ పరిధిలో ఉన్న రోహింగ్యా ముస్లిం తెగల వారు స్థానికులతో పరిచయాలు పెంచుకుని జీవనం సాగిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా రోహింగ్యాల వేలి ముద్రలు, ఐరిస్ తదితర ఆధారాలు సేకరించి వారిపై నిఘా సారించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించనున్నారు.
మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన రోహింగ్యాలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేదు. అత్యంత ప్రమాదకరమైన ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న రోహింగ్యాలు దేశంలోని జమ్మూకాశ్మీర్, హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, మేవాట్ తదితర ప్రాంతాలలో దాదాపు 40వేల మంది శరణార్థులుగా ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నివేదిక మేరకు రాష్ట్ర పోలీసులు వారి కదిలికలపై దృష్టి సారించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోహింగ్యాలు ఉన్నారని, మయన్మార్ దేశం నుంచి తరమేస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలతో దేశానికి ముప్పు పొంచిఉందని, వారిని ఎప్పుడైన ఇస్లామిక్ స్టేట్ వాడుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో వారిపై జల్లెడ పడుతున్నట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి ఈ మేరకు స్పెషల్ ఫోకస్ పెట్టి రోహింగ్యాల ఏరివేతకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.