ఏపీ ముఖ్యమంత్రి హోదాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాలనకు సంబంధించిన అసలు నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన ఇవాళ శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య ఏపీకి గడ్డు కాలం నడిచిందని.. జాతీయసగటుతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి తక్కువగా నమోదైందని చెప్పారు. విభజన నాటికి రూ.20వేల కోట్ల ఆర్థికలోటులోనే ఉన్నా గత ప్రభుత్వ హయాంలో విపరీతంగా అప్పులు చేసి వ్యయాన్ని వృథా చేశారని లెక్కలతో సహా వెల్లడించారు. 2014-15లో మైనస్ వృద్దిరేటు నమోదైందని.. అప్పులు పెరిగిపోయాయని అన్నారు. గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అప్పులు చేసిందని.. ప్రస్తుతం ఆ అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం రూ.66వేల కోట్ల ఆర్థిక లోటులో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. ఎఫ్ఆర్బీఎం యాక్ట్ ప్రకారం ఏపీ స్థూల ఉత్పత్తిలో 3శాతం మాత్రమే అప్పు చేయవచ్చని, కానీ 2015 నుంచి ప్రభుత్వం పరిధి దాటి మరీ అప్పు చేసిందన్నారు. ఎక్కడా పనికొచ్చే ఖర్చు చేసినట్టు లేదని.. దుబారా ఖర్చులు, వృథా ఖర్చులు ఎక్కువగా చేశారని అన్నారు. అప్పు చేస్తే.. లాభదాయకంగా ఉండేలా ఖర్చు చేయాలని, గత ప్రభుత్వం అందుకు విరుద్దంగా అనవసర ఖర్చులు చేసిందన్నారు. కేవలం కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేసేందుకే అనవసర ఖర్చులు చేశారని అన్నారు. ` పన్ను రూపంలో వచ్చే ఆదాయం పరంగా చూసినట్లైతే తెలంగాణ కంటే మనం బాగా వెనుకబడి ఉన్నాం. మౌలిక రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు. రాష్ట్ర రెవెన్యూ లోటు 66 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. తెలంగాణకు వచ్చినంతగా మనకు పన్ను ఆదాయం రావడం లేదు. మొత్తంగా రాష్ట్రంపై 3 లక్షల 62 వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపారు’ అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన గణాంకాల మాయపై బుగ్గన ఘాటుగా స్పందించారు. వ్యవసాయరంగంలో 1999- 2004 మధ్య కాలంలో 3.66 శాతం వృద్ధిరేటు ఉందని, 2004- 2009 మధ్య ఐదేళ్ల కాలంలో 6.14 శాతం నమోదైందని ఆయన వివరించారు. ``గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం స్థూల ఉత్పత్తి తగ్గింది. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరగిందని.. వ్యవసాయ రంగం వృద్ధిరేటు పెరిగిందంటూ అంచనాలు తయారు చేశారు. చేపల పెంపకం పెరిగినంద మాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుంది. ఎందుకీ అబద్దపు లెక్కలు? ఇలాంటి వాటి ద్వారానే ప్రచారం చేసుకున్నారు తప్పించి అసలు ప్రయోజనం చేయలేదు’ అని బుగ్గన ప్రశ్నించారు.