ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలిరోజే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య హాట్ హాట్ చర్చ సాగిన సంగతి తెలిసిందే. మొదట్లో కాళేశ్వరాన్ని వ్యతిరేకించిన జగన్ ఎలా ప్రారంభోత్సవానిలోయ్ వెళ్లారని ప్రతిపక్ష నేతలు ప్రశించగా సీఎం సంధానం చెబుతూ నేను వెళ్లినా వెళ్లకపోయినా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగేదని, కానీ చంద్రబాబుగారు అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ఆ ప్రాజెక్ట్ కట్టడం జరిగిందని, అప్పుడు ఆయన గాడిదలు కాస్తున్నారా అని ప్రశించారు. రైతు సమస్యలపై చర్చలో భాగంగా టీడీపీ ఉప నేత నిమ్మల రామానాయుడు సున్నా వడ్డీ పథకం కొత్తదేమీ కాదని వ్యాఖ్యానించడంతో సభలో దుమారం చెలరేగింది. ఈ పథకం గతంలో కిరణ్కుమార్ రెడ్డి ప్రవేశపెట్టగా.. తమ ప్రభుత్వం సైతం దాన్ని కొనసాగించిందని తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తెదేపా విమర్శలు తప్పని నిరూపిస్తే చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.
అయితే, జగన్ మెడకే రాజీనామా ఉచ్చు పడేలా చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరువు మండలాలను నోటిఫై చేశాక రుణాలు రీ షెడ్యూలవుతాయని, జగన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే.. కోరస్లా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని మండిపడ్డారు. సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వండి.. తప్పులేదు.. కానీ తెదేపా హయాంలో రైతుల ఆత్మహత్యలకు తక్కువ ఇచ్చారు అనడం సరికాదని మండిపడ్డారు.
పచ్చి అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేసే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. ``చెప్పేది అబద్దం, చేసేది ఛాలెంజ్..ఇంతకన్నా బరితెగింపు ఇంకేమైనా ఉందా..? రికార్డులు తెప్పిస్తా, మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేస్తారు. రికార్డులతో నేను సభలోకి వస్తే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకుని పరారు కావడం చూశాం.
రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వ్యక్తికి సున్నా వడ్డీ రుణాలు, లక్ష నుంచి 3లక్షల లోపు తీసుకున్నవారికి పావలా వడ్డీ వర్తిస్తుంది.అసలు ఎవరికి సున్నా వడ్డీ వర్తిస్తుందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడాలి..? వాస్తవాలు ఇలావుంటే, అబద్దాలు చెప్పి ఛాలెంజ్ చేయడం ఇదే తొలిసారి చూస్తున్నాం. ఇప్పుడు రికార్డులు మీడియా ద్వారా విడుదల చేస్తున్నాం. మరి మీరు రాజీనామా చేస్తారా..? రాజీనామా చేయకపోతే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పండి.. ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ నుంచి పారిపోవడం ఎప్పుడన్నా చూశామా..? అడ్డంగా దొరికారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిపోయారు. దొంగ ఛాలెంజ్ లు చేసి ఆఘమేఘాల మీద అర్ధంతరంగా వాయిదా వేసుకుని పోయారు.అబద్దాలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది. `` అని వ్యాఖ్యానించారు.